పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...

- June 30, 2024 , by Maagulf
పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...

అమరావతి: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారి పవన్ పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు. మూడు రోజులు పిఠాపురంలోనే పవన్ పర్యటన కొనసాగనుంది. జులై 1, 2, 3 తేదీల్లో కాకినాడ జిల్లా పుఠాపురంలోనే పవన్ బస చేయనున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జనసైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా.. జూలై 1వ తేదీ (రేపు) ఉదయం  విమానంలో హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో గొల్లప్రోలు మండలం గొల్లప్రోలులో సత్య కృష్ణ కన్వెన్షన్ హల్ లో  పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుని పిఠాపురం నాయకులతో, వీర మహిళలతో, స్థానిక ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 2వ తేదీన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలనుండి 11:30 వరకు పంచాయతీ శాఖ అధికారులతో, 11:30 నుండి 12:30 వరకు జల వనరుల శాఖ అధికారులతో, 12:30 నుండి 1:30 వరకు అటవీ శాఖ అధికారులతో, 1.30 నుండి 2 గంటల వరకు రహదారుల పరిస్థితి పై పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుని జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు.

మూడోరోజు (జూలై 3వ తేదీ) ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గంలోని అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ, బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. పిఠాపురం నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుండి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com