నైజీరియాలో దారుణం..18 మందికి పైగా మృతి

- June 30, 2024 , by Maagulf
నైజీరియాలో దారుణం..18 మందికి పైగా మృతి

నైజీరియా: నైజీరియాలోని నార్త్ఈస్ట్ బోర్నో రాష్ట్రంలోని గ్వోజా పట్టణం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. అనుమానిత మహిళా ఆత్మాహుతి బాంబర్లు జరిపిన వరుస దాడుల్లో 18 మంది మరణించగా.. మరో 50మందికిపైగా గాయాలయ్యాయి. గ్వోజా పట్టణంలో ఓ పెళ్లి, అంత్యక్రియలు, ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్లు రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ అధిపతి తెలిపారు. శనివారం జరిగిన ఈ బాంబు పేలుళ్లలో.. తొలుత గ్వోజాలో ఓ వివాహ వేడుకలో మొదటి బాంబు పేలుడు చోటు చేసుకుంది. అనంతరం ఆసుపత్రిలో, ఓ అంత్యక్రియలు జరుగుతున్న చోట వరుస పేలుళ్లు సంభవించాయి.

వరుస బాంబు పేలుళ్లతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలిలో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన వెనుక సూసైడ్ బాంబర్లు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

బోర్నో రాష్ట్రంలో దశాబ్ద కాలంగా ఇస్లామిస్ట్ తిరుగుబాటుకు కేంద్రంగా ఉంది. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తరచూ బోకో హరామ్, దాని అనుబంధ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రియా ఫ్రావిన్స్ అనే ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడుతూ ఉంటాయి. ఈ దాడులతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 20లక్షల మంది నిరాశ్రయులైయ్యారు. 2014లో గ్వోజాను బోకో హరామ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే, ఛాద్ సైన్యం మద్దతుతో నైజీరియా సైన్యం ఈ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకుంది. అయినా పౌరులు, భద్రతా దళాలపై నిత్యం దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజా ఘటనపై బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి బార్కిండో సైదు మాట్లాడుతూ.. మృతుల్లో పిల్లలు, పెద్దలతో పాటు గర్భిణీ స్త్రీకూడా ఉన్నట్లు తెలిపారు. బాంబుల పేలుళ్లకు మృతదేహాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయని చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే, ఈ దాడులకు ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com